schema:text
| - Fri Feb 28 2025 14:31:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: SLBC ప్రమాద సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల్లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
SLBC ప్రమాద సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Claim :
SLBC ప్రమాద సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల్లో ఉన్నారుFact :
2022 సంవత్సరంలో నుండి ఈ విజువల్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయిశ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) కుప్పకూలడంతో అందులో చిక్కుకున్న ఎనిమిది మందిని సజీవంగా వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. బురద ఎక్కువగా ఉండడంతో వారిని చేరుకోవడానికి ఉత్తమమైన పద్ధతి కోసం రెస్క్యూ బృందం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎస్.ఎల్.బి.సి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ అనేక అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా వారి జాడ తెలియడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. టీబీఎం చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు పడి ఉండటంతో పాటు మూడు మీటర్ల మేర బురద, నీరు నిలిచిపోయింది.
ఇంకా నీరు ఉబికి వస్తుండటంతో లోపలకి వెళ్లిన సహాయక బృందాలు వెనక్కు తిరిగి వస్తున్నాయి. టీబీఎం ను కదిలిస్తే కూలిపోతుందని, పై కప్పు మరీ డేంజర్ గా ఉండటంతో ఆ ప్రయత్నం మాత్రం సహాయక బృందాలు చేపట్టడం లేదు. లోపలికి ఆక్సిజన్ ను పంప్ చేస్తున్నారు. ఆహారపదార్థాలను కూడా లోపలికి పంపుతున్నా వారికి అందుతున్నాయో లేదో తెలియడం లేదు. టన్నెల్ చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు రెస్క్యూ టీం చెబుతుంది. టీబీఎం మిషన్ కింది భాగంలో ఊబిలాంటి ప్రదేశం ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని సహాయక బృందాలు చెబుతున్నాయి.
“NDRF, SDRF, ర్యాట్ మైనర్లతో కూడిన 20 మంది సభ్యుల బృందం (సొరంగం) చివరి పాయింట్లను చేరుకోగలిగింది. కానీ చాలా శిథిలాలు ఉన్నాయి. ఎలా వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు’’ అని నాగర్కర్నూల్ పోలీసు సూపరింటెండెంట్ వైభవ్ గైక్వాడ్ పీటీఐకి తెలిపారు. ఈ సంఘటన ఫిబ్రవరి 22 న సొరంగం యొక్క ఒక భాగం కూలిపోవడంతో దానిలో ఎనిమిది మంది వ్యక్తులు చిక్కుకున్నారు. కఠినమైన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున సొరంగంలో చిక్కుకున్న వారు తిరిగి వస్తారనే ఆశలతో బంధువులు ఉన్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కోమటి రెడ్డి విదేశాల్లో తిరుగుతూ ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"SLBC టన్నెల్లో 8 మంది చనిపోతుంటే దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నావా కాకా" అంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2022 సంవత్సరానికి సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా ప్రచారం చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా సహాయ సహకారాలకు పర్యవేక్షిస్తూ ఉన్నారని పలు కథనాలు మాకు లభించాయి.
"SLBC టన్నెల్లో చిక్కుకున్న వాళ్లు బయటికి వస్తారని చిన్న ఆశ ఉంది: కోమటిరెడ్డి" అంటూ సమయంలో ఫిబ్రవరి 24న పబ్లిష్ చేసిన కథనం మాకు లభించింది.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాదం చాలా విషాదకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో బయటకు వస్తారని ఎక్కడో చిన్న ఆశ ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయ చర్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కలిసి పర్యవేక్షించారని ఆ కథనం తెలిపింది.
ఫిబ్రవరి 26న సంఘటన స్థలానికి చేరుకున్న నేతల్లో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉన్నారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించడం, అక్కడ పలువురితో సంప్రదింపులు జరిపిన కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలలో టన్నెల్ లోపలికి వెళ్లిన విజువల్స్ ను కూడా పోస్టు చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమయంలో విదేశాల్లో లేరని మేము ధృవీకరించాం.
ఇక వైరల్ అవుతున్న విజువల్స్ ను తీసుకుని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు మీడియా సంస్థలు ఈ వీడియోను 2022లోనే పోస్టు చేశారని స్పష్టంగా తెలుస్తోంది.
2022 నుండి వైరల్ విజువల్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : SLBC ప్రమాద సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|