schema:text
| - Tue Feb 11 2025 14:42:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 02-02-2025న భారీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
భారీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది
Claim :
02-02-2025న భారీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందిFact :
2019 లో హైదరాబాద్ లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ వీడియో2025, జనవరి నెలలో జల్గావ్ లో రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12 అని అధికారులు తెలిపారు. ట్రైన్ నెంబర్ 12533 ముంబైకి వెళ్లే పుష్పక్ ఎక్స్ప్రెస్లో చైన్ ను లాగడంతో కొంతమంది ప్రయాణికులు రైలు దిగి పక్కనే ఉన్న పట్టాలపై నిలబడ్డారు. ఇంతలో వారిని కర్నాటక ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో ప్రయాణీకులు మరణించారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలోని పచోరా పట్టణానికి సమీపంలోని మహేజీ - పర్ధాడే స్టేషన్ల మధ్య ప్రమాదం జరిగింది. ట్రైన్ లో ఉండగా పొగను గమనించామని, అందుకే ట్రైన్ ను దిగామని ప్రయాణీకులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పగాయాలైన వారికి 5000 రూపాయలు అందించింది భారతీయ రైల్వే.
ఇంతలో ఫిబ్రవరి 2న భారీ రైలు ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒకే ట్రాక్లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజ్మీర్ నుంచి అస్సాం వెళుతున్న రైలు జైపూర్లో ప్రమాదానికి గురైందని వైరల్ పోస్ట్ పేర్కొంది.
ఫిబ్రవరి 2, 2025న ఒక క్లిప్ను పోస్ట్ చేసి జైపూర్లో రైలు ప్రమాదం జరిగిందని సోషల్ మీడియా ఖాతాదారులు పోస్టులు పెట్టారు.
వీడియో క్లిప్లో “ఈరోజు ఉదయం 12 గంటలకు, అజ్మీర్ నుండి అస్సాంకు వెళ్తున్న రైలు మరొక రైలును ఢీకొట్టింది, ఫలితంగా 7 మంది మరణించారు 50 మంది గాయపడ్డారు." అని ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో హైదరాబాద్ కు చెందినది. 2019 లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది.
రాజస్థాన్ లో ఇటీవల అలాంటి ప్రమాదం ఏదైనా జరిగిందా? అని తెలుసుకోవడం Google సెర్చ్ చేశాం. కీవర్డ్ సెర్చ్లో జైపూర్లో రైలు ప్రమాదాన్ని నిర్ధారించే విశ్వసనీయ వార్తా కథనాలు మాకు కనిపించలేదు.
వైరల్ వీడియోలోని స్క్రీన్ షాట్ ను తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేశాం. నవంబర్ 12, 2019న అప్లోడ్ చేసిన ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ యూట్యూబ్ ఛానెల్లో వీడియో కనుగొనబడింది. ఈ సంఘటన నవంబర్ 11, 2019న హైదరాబాద్లో జరిగిందని అందులో ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన CCTV ఫుటేజీని భారతీయ రైల్వే అధికారికంగా విడుదల చేసింది.
ఇక ఇదే ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ తో పలు కథనాలను పోస్టు చేశారు.
CCTV Visuals: Kacheguda MMTS Train Mishap || Hyderabad || NTV అంటూ తెలుగు మీడియా సంస్థ ఎన్టీవీ యూట్యూబ్ ఛానల్ లో వీడియోను పోస్టు చేశారు. ఎంఎంటీఎస్ ట్రైన్ కు ప్రమాదం జరిగిందని ఈ కథనాలు ధృవీకరించాయి. నవంబర్ 11, 2019లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
"హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి.
#Kacheguda #TrainAccident #Hyderabad #MMTS" అంటూ BBC News Telugu ఫేస్ బుక్ లో ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను షేర్ చేశారు.
"లోకో పైలట్ తప్పిదం వల్లే కాచిగూడ ప్రమాదం: అధికారులు" అంటూ సమయం న్యూస్ లో నవంబర్ 13, 2019న ఓ కథనాన్ని మేము చూశాం.
కాచిగూడ రైలు ప్రమాదంలో సిగ్నలింగ్ తప్పులేదని, సిగ్నల్ ఇవ్వకుండానే లోకో పైలట్ ఎంఎంటీఎస్ రైలును ముందుకు తీసుకెళ్లాడని రేల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఎక్స్ప్రెస్ రైలును ఢీ కొట్టడంతో ఎంఎంటీఎన్లోని 6 బోగీలు దెబ్బతిన్నాయని, ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్లాల్సిన ఎంఎంటీఎస్ రైలు ప్లాట్ఫాం-2 పైకి వచ్చింది. అదే సమయంలో కర్నూలు నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాచిగూడ స్టేషన్ను సమీపించింది. హంద్రీ ఎక్స్ప్రెస్కు ప్లాట్ఫామ్-3 కి సిగ్నల్ ఇచ్చాం. ఆ సమయంలో ప్రధాన లైన్ నుంచి లూప్ లైన్లోకి వస్తోంది. అదే సమయంలో ఎంఎంటీఎస్ రైలును లోకో పైలట్ ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం జరిగిందని సీపీఆర్వో లోకేశ్ తెలిపారు.
పలు మీడియా సంస్థలు ఈ ప్రమాదంపై తమ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, 2019లో కాచిగూడలో చోటు చేసుకున్న ప్రమాదాన్ని ఇటీవలిదా ప్రచారం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : 02-02-2025న భారీ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|